ఈ బ్లాగును సెర్చ్ చేయండి

14, జూన్ 2015, ఆదివారం

ఆధార్ కార్డు తో ఓటర్ ఐ.డి. లింక్ చేయడం

ఆధార్ కార్డు తో ఓటర్ ఐ.డి. లింక్ చేయడం

తెలంగాణా రాష్ట్రంలో అనేక మందికి రెండుచోట్ల ఓటర్‌గుర్తింపు కార్డులు ఉన్నాయి. కానీ, వీరు ఒకే చోట మాత్రమే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దీంతో ఇటు ప్రభుత్వానికి, అటు ఎన్నికల సంఘానికి అసలైన ఓటర్లు ఎందరున్నారో అర్థం కాక తికమకపడుతున్నారు. దీనిని నివారించేందుకు ప్రతి ఓటుహక్కు కలిగిన వారి వివరాలు సేకరించి ఆధార్ సంఖ్యను ఓటుహక్కుతో జతపరచడం వల్ల బోగస్ ఓటర్లను తొలగించవచ్చని ఎన్నికల సంఘం నిర్ణయించింది.

ఇందులో భాగంగా ప్రతి జిల్లాలోనూ ఓటర్‌కార్డుతో ఆధార్ అనుసంధాన ప్రక్రియ వేగంగా జరుగుతుంది. బీ.ఎల్‌.ఓ.ల (బూత్ లెవల్ అధికారులు) తో ఇంటింటికి పంపించి ఓటర్ల ఆధార్ సంఖ్యలను సేకరిస్తున్నారు. ఇంతవరకు వివిధ నియోజకవర్గాల్లోని ఓటర్లలో కేవలం 20.52 శాతం మంది మాత్రమే ఓటర్‌కార్డుకు ఆధార్‌ను అనుసంధానం చేసుకున్నారు.
అయితే మరో 75 శాతం ఓటర్ల ఆధార్‌కార్డుల వివరాలు జిల్లాలలోని బూత్‌లెవల్ అధికారుల వద్ద సిద్ధంగా ఉన్నాయని అధికారులంటున్నారు. హైదరాబాద్ జిల్లాలో పది నియోజకవర్గాలకు కలిపి మొత్తం 19,71,207 మంది ఓటర్లున్నారు. వీరిలో 4,04,436 మంది ఆధార్‌కార్డులు మాత్రమే అనుసంధానమయ్యాయి. ఓటుహక్కు గురించి కచ్చితమైన సమాచారం ఒకరికి ఒకే ఓటుహక్కుని నాదంతో బీ.ఎల్‌.పీ.ఓ. లతో పాటు ఆన్‌లైన్, సెల్‌ఫోన్ మెస్సెజ్‌ల ద్వారా కూడా ఆధార్ అనుసంధాన ప్రక్రియను నిర్వహిస్తున్నారు. కేవలం ఒక ఓటర్ గుర్తింపుకార్డుకు మాత్రమే ఆధార్‌కార్డు పనిచేస్తుంది.
మరో చోట ఉన్న ఓటర్ గుర్తింపు కార్డుకు అనుసంధానం చేసేందుకు ప్రయత్నిస్తే, ఇప్పటికే ఆధార్ నంబర్ జత చేశారని చెప్పేస్తుంది. ఈ క్రమంలో ఆధార్‌ను అనుసంధానం చేసుకోని ఓటర్ గుర్తింపు కార్డు రద్దవుతుంది. దీంతో అసలైన ఓటర్లు మాత్రమే మిగిలే అవకాశముంది. ఓటర్‌కార్డుతో ఆధార్ అనుసంధానం ఈనెల 31లోగా పూర్తిచేసుకోవాలని ఎన్నికల సంఘం సందేశాలు వస్తున్నాయి. ప్రచారం లేకపోవడంతో చాలా మంది ఓటుహక్కును కోల్పోయే అవకాశముంది.

ఆధార్ కార్డు ని ఓటర్ కార్డు తో లింక్ చేయుటకు అందుబాటులో ఉన్న పలువిధాలు..

ఓటర్ గుర్తింపు కార్డుకు ఆధార్ అనుసంధాన ప్రక్రియకు ఎన్నికల సంఘం పలు విధానాలు రూపొందించింది. బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓ) ఇప్పిటికే ఓటర్ జాబితాల్లో ఆధార్ నంబర్లను సేకరిస్తున్నారు. వాటిని ఆన్‌లైన్ కి ఎక్కిస్తారు. ఈ మేరకు ఆయా మండలాల తహసీల్దార్లు బీఎల్‌ఓలకు శిక్షణ ఇచ్చారు. దీంతో పాటు ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్, ఆండ్రాయిడ్ సెల్‌తో అప్లికేషన్, సంక్షిప్త సందేశం, నేరుగా కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసి ఇలా నాలుగు రకాలుగా ఆధార్ అనుసంధానం చేసుకోవచ్చు. అవెలాగంటే..
మెసేజ్‌ (ఎస్.ఎం.ఎస్.) తో..
సాధారణ సెల్‌ఫోన్‌తోనూ ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం చేసుకోవచ్చు. అందుకు ప్రత్యేక నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది తెలంగాణ ఎన్నికల సంఘం. SEEDEPIC అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఓటర్ గుర్తింపు కార్డు సంఖ్య తర్వాత మరో స్పేస్ ఇచ్చి ఆధార్ నంబర్‌ను నమోదు చేసి 8790499899 నంబర్‌కు ఎస్సెమ్మెస్ పంపితే సరిపోతుంది. నంబర్లు సరిగా ఉంటే మీ ఓటు సంఖ్య ఆధార్‌తో అనుసంధానం అయిందని రిైప్లెవస్తుంది. ఇప్పటికే సెల్ వినియోగదారులందరికీ ఈ విషయం సంక్షిప్త సందేశం ద్వారా పంపించింది ఎన్నికల సంఘం.
ఇంటర్‌నెట్‌లో..
తెలంగాణ ఎన్నికల సంఘం వెబ్‌సైట్ www.ceotelangana.nic.in లో ఆధార్ సిడీంగ్‌ను నొక్కాలి. అక్కడ వన్ టైం పాస్ వర్డుతో అనుసంధానం అవుతుంది. ముందుగా ఓటర్ గుర్తింపు కార్డు సంఖ్య, ఆపై ఆదార్ సంఖ్య నమోదు చేసి సెల్‌నెంబర్ ఇవ్వాలి. ఆ తర్వాత ఓటీపీ (వన్ టైం పాస్వర్డ్) వస్తుంది. పాస్‌వర్డ్ నమోదు అనంతరం ఓవైపు ఆధార్ కార్డు మరోవైపు ఓటర్ కార్డు వివరాలు తెరపై ప్రత్యక్షమవుతాయి. వాటిని అనుసంధానం చేసుకుంటే సరిపోతుంది.
ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా..
ఆండ్రాయిడ్ లేదా ఐ.ఓ.ఎస్. సాఫ్ట్‌వేర్ ఉన్న సెల్‌ఫోన్‌లో ఎన్నికల సంఘం రూపొందించిన ప్రత్యేక అప్లికేషన్ (యాప్) ను వినియోగించుకుని ఆధార్ అనుసంధానం చేసుకోవచ్చు. యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్నాక. ఇంటర్‌నెట్‌లో మాదిరిగానే ఓటర్ గుర్తింపుకార్డు, ఆధార్ సంఖ్యలు ఇచ్చి అనుసంధానం చేస్తే సరిపోతుంది.
కాల్‌సెంటర్ ద్వారా..
నేరుగా కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసి ఆధార్‌ను అనుసంధానం చేసుకోవచ్చు. 1950 నంబర్‌కు ఫోన్ చేస్తే కాల్‌సెంటర్ ప్రతినిధి మాట్లాడతారు. ఆ తర్వాత ఓటర్ గుర్తింపు కార్డు సంఖ్య, ఆధార్ సంఖ్యను చెబితే అప్పటికపుడు నమోదు చేస్తారు. ఇది కూడా సులభ ప్రక్రియ.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి